భోజనం చేస్తూ ఇనుప మేకు మింగిన మహిళ
ఎండోస్కోపీతో విజయవంతంగా తొలగింపు
మహిళకు ప్రాణాపాయం తప్పించిన వైద్యులు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
భోజనం చేస్తుండగా అనుకోకుండా ఇనుప మేకును మింగిన 56 ఏళ్ల మహిళకు కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన మహిళ మంగళవారం రాత్రి భోజనం చేస్తుండగా అనుకోకుండా ఇనుప మేకును మింగారు. దీంతో ఆ మేకు గొంతులో ఇరుక్కుపోవడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాలలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్యులు డాక్టర్ నవీన్ ఆడెపును సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గొంతులో ఇరుక్కున్న ఇనుప మేకును ఎండోస్కోపీ ద్వారా అత్యంత జాగ్రత్తగా, చాకచక్యంగా తొలగించారు.
మేకు విజయవంతంగా తొలగించడంతో మహిళకు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉపశమనం లభించింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా సకాలంలో స్పందించి చికిత్స అందించిన డాక్టర్ నవీన్ ఆడెపుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

