ముర్రుపాలు శిశువుకు తొలి టీకా లాంటివే
తల్లులకు అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ శ్వేత తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రసవం జరిగిన గంటలోపు శిశువుకు ముర్రుపాలు (కొలస్ట్రం) తాగించడం ఎంతో అవసరమని తెలిపారు. ముర్రుపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉండటంతో పాటు, అనేక రకాల వ్యాధుల నుంచి రక్షించే రోగనిరోధక శక్తి లభిస్తుందని వివరించారు.
ముర్రుపాలు తాగిన శిశువుల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని, ప్రతి తల్లి తప్పనిసరిగా పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ కుమార్ చిన్నారులకు యూనిఫాం దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై గ్రామ మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ కుమార్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ శ్వేత, ఆశా కార్యకర్తలు లక్ష్మీ తదితరులు, గ్రామ మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

