జంక్ ఫుడ్కు దూరంగా ఉంచాలి.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందించాలి
కోల్ బెల్ట్ న్యూస(మంచిర్యాల):
చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు రోగనిరోధక శక్తి, ఏకాగ్రతకు సమతుల్య పోషకాహారం ఎంతో కీలకమని నేచురోపతి, యోగా వైద్యురాలు, వెల్నెస్ నిపుణురాలు, లైఫ్స్టైల్ కోచ్ డాక్టర్ పి. సమీరా రెడ్డి అన్నారు. మంచిర్యాల జన్మభూమి నగర్లోని ఎథిక్ అకాడమీ స్కూల్ ఆధ్వర్యంలో ‘న్యూట్రినెక్స్ట్ – నేడు పోషణ.. రేపు ఆరోగ్యకరమైన భవిష్యత్తు’ పేరుతో సోమవారం హోటల్ సుచిత్ర ఇన్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సమీరా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషక విలువలున్న సమతుల్య ఆహారం అందించడం అవసరమన్నారు. ప్రస్తుతం పిల్లల్లో పెరుగుతున్న జంక్ ఫుడ్ అలవాట్లను తగ్గించి, అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇంట్లోనే పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్నతనం నుంచే పెంపొందించాలని తెలిపారు. బాల్యంలో ఏర్పడే ఆహారపు అలవాట్లు భవిష్యత్తు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వివరించారు.
ప్రతిరోజూ పాటించగలిగే సులభమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని తమ విలువైన సూచనలు, అభిప్రాయాలను పంచుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చురుగ్గా పాల్గొని నిపుణులతో నిర్వహించిన చర్చలో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి ఆరోగ్యం, పోషణపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారుల్లో చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడంలో పాఠశాల, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ‘న్యూట్రినెక్స్ట్’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టినట్లు తెలిపారు.

