సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాలకులు విస్మరించడం అన్యాయమని, ఆ మహత్తర పోరాట చరిత్రను భావితరాలకు అందించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మందమర్రి బస్స్టాండ్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, కూలీలు, మహిళలు, సామాన్య ప్రజలు సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో మహత్తర అధ్యాయమని లక్ష్మణ్ అన్నారు. రైతులకు భూమి, వెట్టిచాకిరీ నిర్మూలన, సామాజిక న్యాయం కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ఈ పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు.
అలాంటి చారిత్రక పోరాటాన్ని నేటి తరానికి తెలియకుండా చేయడం చరిత్రను వక్రీకరించడమేనని ఆయన అన్నారు. ‘‘మా చరిత్ర.. మా చరిత్ర’’ అంటూ బీజేపీ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఏమిటో, ఆ పోరాటంలో పాల్గొన్న తమ వీరులు ఎవరో తెలంగాణ ప్రజలకు బీజేపీ నాయకులు స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని, రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్, భీమనాదని సుదర్శన్, మందమర్రి మండల కార్యదర్శి వనం సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి కామెర దుర్గారాజ్, తాళ్లపల్లి వీరయ్య, రొడ్డ నరేష్, ఎగేటి రాజేశ్వరరావు, ఆంతోని దినేష్, సాధనవేణి ప్రభాకర్, మహిళా నాయకురాలు రేఖ, మంజుల, ప్రజానాట్యమండలి కళాకారులు రెంటాల శ్యామ్, జూలవేణి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

