Bibipet : ఉపాధి హామీ కూలీలకు పనిస్థలాల్లో సరైన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను బీబీపేట మండలం మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు కోరారు. బీబీపేట మండలంలోని కోనాపూర్ యాడారంలో చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. కోనాపూర్ యాడారంలో ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు లేకపోవడంతో ఆమె సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను వివరించారు. అదేవిదంగా ఎపిఓ రజిని టి ఏ వినయ్ భరత్ పంచాయతి అశోక్ ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ లకు సైతం సమస్యను వివరించారు.
ఈ సందర్బంగా మాజీ ఎంపీటీసీ నీరజ నరసింహులు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు పనిచేసే స్థలాల్లో కనీస వసతులు లేకపోవడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కనీసం తాగునీరు కూడా లేవని, కూలీలు వెంట తెచ్చుకున్న నీరు సరిపోకపోవడంతో దూరప్రాంతం వెళ్లి తెచ్చుకుంటున్నారని అన్నారు. పనిస్థలంలో ఖచ్చితంగా నీడ కోసం వసతి ఏర్పాటు చేయడం లేదన్నారు. వేసవి ఎండలు తీవ్రం కాక ముందే తాగునీరు, నీడ కోసం టెంట్, ఏర్పాటు చేయాలన్నారు.
వేసవిలో వడదెబ్బ తగలడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వైద్యాధికారులతో సంబంధిత అధికారులు సంప్రదించి గ్లూకోజ్, ORS ప్యాకెట్స్ కూడా ఖచ్చితంగా పనిస్థలాల్లో నిల్వ ఉంచాలని మాజీ ఎంపీటీసీ అధికారులను కోరారు. జాబ్ కార్డు లేనివారికి వెంటనే మంజూరు చేయాలని కోరారు.