సత్తా చాటిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్
గడప దాటకున్నా గోల్ కొట్టిన ఎమ్మెల్యే
విమర్శలను దాటుకొని విజయాన్ని ముద్దాడిన కాంగ్రెస్
Mancheryala : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం హస్తానికి దక్కింది. కార్పొరేషన్ కు మొదటి మేయర్ ఏ పార్టీ వారు అవుతారు అనే అనుమానాలకు ఎక్కడా తావివ్వలేదు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్. అన్నీ తానై ఒంటి చేత్తో ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ప్రత్యర్థుల ఎత్తుకు పై ఎత్తులు వేశారు. గెలుపు గుర్రాలనే పక్కాగా ఎంపిక చేశారు. అభ్యర్థుల ఎంపికలో కూడా ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు. విజయమైనా, అపజయమైనా తనదే భాద్యత. ఆర్థిక బలం, అంగ బలం, స్థానికంగా పేరు ప్రతిష్టలు ఉన్న నేతలనే ఎంపిక చేశారు. గడప దాటకుండానే తనదయిన శైలిలో ప్రత్యర్థులకు చిక్కకుండా రాజకీయ అస్త్రాలను ప్రయోగించారు. విజయం సాధించారు.
మంచిర్యాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తీసుకున్న పలు చర్యలు అక్కడక్కడ విమర్శలకు అవకాశం ఇచ్చాయి. చిన్న, చిన్న గొడవలు, అల్లర్లకు కూడా ఆయన నిందలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ విమర్శలను దాటుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయాన్ని ముద్దాడారు. 60 స్థానాల్లో బరిలో ఉండగా 44 స్థానాల్లో అభ్యర్థులు కాంగ్రెస్ విజయపథాకాన్ని ఎగురవేయడం విశేషం. మంచిర్యాలకె పరిమితం కాకుండా ఎమ్మెల్యే లక్సెట్టిపేట మున్సిపాలిటీని సైతం దక్కించుకున్నారు. గడప దాటకుండానే తన కనుసైగలతోనే లక్సెట్టిపేటలో తన రుచి ఏమిటో ప్రత్యర్థులకు చూపించారు.
తన నియోజకవర్గంలో జరిగిన సర్పంచి ఎన్నికల్లో కూడా ఆయన ఇంటి నుంచే అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసి విజయం సాధించారు. మంచిర్యాల నియోజకవర్గంలో 81సర్పంచి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో 43 మంది సర్పంచి గా ఎన్నిక కావడం విశేషం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 53 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థులకు తిరుగులేని శక్తిగా నిలిచింది. రాబోయే జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ నియోజకవర్గంలో మరింత బలోపేతం కావడం ఖాయం అంటున్నారు రాజకీయ శ్రేణులు.

by