Home » Poojarulu : అక్కడ వరుసగా పూజారులు మరనిస్తున్నారు…. మరణాల వెనుక అనేక అనుమానాలు ?

Poojarulu : అక్కడ వరుసగా పూజారులు మరనిస్తున్నారు…. మరణాల వెనుక అనేక అనుమానాలు ?

Poojarulu : ఇక్కడ ఒక గుడి అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు. దేవతా మూర్తులు కనబడరు. పదిమంది ఘనంగా చెప్పుకోడానికి ఆలయ ప్రాకారాలు కనబడవు. ఘనకీర్తిని చెబుతామంటే నిర్మాణమైన ప్రాంతం కూడా అక్కడ లేదు. అక్కడ ఏమి లేకున్నా.. ఉన్నదల్లా ఒక్కటే కనబడుతుంది. కొండంత భక్తి. నిలువెత్తు బంగారం ఇస్తే చాలు కొండంత అండగా ఉంటుందనే నమ్మకం.

ఆ వనంలో కొలువైన తల్లులు చల్లగా చూస్తారనే భరోసా. అందుకనే ములుగు జిల్లా తాడ్వాయి మండలం చిలకల గుట్టలో వెలసిన వనదేవతలు సమ్మక్క-సారక్కలకే అంతటి ఘనమైన ఖ్యాతి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే అమ్మవార్ల జాతరకు దేశం నలుదిక్కుల నుంచి తండోపతండాలుగా భక్తిశ్రద్దలతో తరలివస్తారు. గద్దెలపై కొలువైన ఆ వనదేవతలను దర్శించుకొని మమ్మల్ని చల్లంగా చూడాలి తల్లి అంటూ మొక్కులు చెల్లిస్తారు.

సమ్మక్క-సారలమ్మలను గద్దెలపై నిలిపే ప్రక్రియ నుంచి మొదలుకొని తిరిగి వనప్రవేశం చేసే వరకు కూడా పూర్తిగా ఆదివాసీ సంప్రదాయం వరకు పూజలు జరుగుతాయి. సమ్మక్క వంశానికి చెందిన పూజారులే పూజలు నిర్వహిస్తారు. ఎంతో భక్తిశ్రద్దలతో క్రతువులు నిర్వహించే పూజారులు తమ పద్దతులను ఖచ్చితంగా పాటిస్తారు. ప్రతిరోజూ పూజారులు సమ్మక్కను తలచుకోకుండా ఉండలేరు.

ప్రతి నిత్యం సమ్మక్క-సారలమ్మ నామస్మరణంతో పూజలు చేస్తూ రెండేళ్లకోసారి జాతరను నిర్వహించే పూజారులు వరుసగా మరణించడంతో కన్నెపల్లి గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకరి చితిమంటలు ఆరకముందే మరొకరి చితిమంటలు అంటు కోవడంతో తోటి పూజారులు కూడా ఆవేదన చెందుతున్నారు. భక్తులు కూడా దిగ్బ్రాంతికి గురవుతూన్నారు. గడిచిన కొద్దిరోజుల్లోనే ఇద్దరు ప్రధాన పూజారులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

మరణించిన సంపత్, ముత్తయ్య ఇద్దరు కూడా సమ్మక్క నామస్మరణం చేసిన తరువాతనే ఇతర కార్యక్రమాలను చేపడుతారు. ఆ ఇద్దరు కూడా నిష్ఠగా ఉంటారు. జాతర సమయంలో భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. లక్షలాది భక్తులు వచ్చి నప్పటికీ నిగ్రహాన్ని కోల్పోకుండా పూజలు చేసి ఆ తల్లులను గద్దెలపైకి తీసుకువస్తారు. అటువంటి పూజారులు ఒకరి తరువాత ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కన్నెపెల్లి గ్రామస్తులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవలనే సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య మరణించాడు. ఆయన తరువాత కొద్దిరోజులకే సారలమ్మ ప్రధాన పూజారి సంపత్ కూడా కన్నుమూశారు. వీరిద్దరి వయసు 50 ఏళ్ల లోపు ఉంటది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రధాన పూజారులు కన్నుమూయడంతో కన్నెపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఇద్దరు ముఖ్యమైన పూజారులు మరణించడంతో ఆ వనదేవతలకు నిర్వహించే పూజలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు సైతం భక్తుల్లో వ్యక్తం అవుతున్నాయి.

అనారోగ్యంతోనే ఇద్దరు చనిపోయారని, సకాలంలో చికిత్స అంది ఉంటె చనిపోయేవారు కాదని కన్నెపల్లి గ్రామస్తులతో పాటు ఊరట్టం గ్రామస్తులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఆ తల్లులు మాకు అన్యాయం చేసేవారు కాదని మాకు నమ్మకం. ఇప్పటి వరకు మా పూజారుల కుటుంబాల్లో దుఃఖం అనేది తెలియదని ఆ తల్లుల దీవెనతో మేము ఆనందంగా ఉన్నామని కన్నెపల్లి, ఊరట్టం గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *