మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలు
ఆధ్యాత్మిక, సాహిత్య కార్యక్రమాలకు ఏర్పాట్లు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా సాహితీ సంస్థల సమితి ఆధ్వర్యంలో ప్రముఖ పండితుడు డాక్టర్ మర్రిపల్లి వెంకటరమణతో శతావధాన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మహోత్సవం ఆగస్టు 8, 9, 10 తేదీలలో మూడు రోజుల పాటు జరగనుందన్నారు.
ఈ కార్యక్రమంలో శతావధాన ధురీణులు, శతావధాన మహారథులు, శతావధాన ప్రభాకరులు, శతావధాన ధురంధరులు పాల్గొని సాహిత్యాభిమానులను అలరించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఈ మహోత్సవం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ నారాయణ (మార్వాడీ) మండపంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని సాహిత్యాభిమానులు, కవులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు.

