అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
జన్మభూమి నగర్లోని సృష్టి ఎంక్లేవ్ అపార్ట్మెంట్లో వినాయక నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలు భక్తిశ్రద్ధలతో అందమైన ముగ్గులు వేశారు. అనంతరం 108 రకాల స్వీట్లు, 108 రకాల ప్రసాదాలతో స్వామివారికి ఘనంగా నైవేద్యం సమర్పించారు.
వేద మంత్రోచ్చారణలు, భక్తుల ప్రార్థనలు, గణపతి నామస్మరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని గణనాథుడిని భక్తులు వేడుకున్నారు. భారీ సంఖ్యలో నైవేద్యాలను సమర్పించడం ద్వారా భక్తుల ఆధ్యాత్మిక భక్తిభావం, ఐక్యత ప్రతిఫలించాయి.
ఈ వేడుకల్లో కాలనీవాసులతో పాటు పేరం రాజయ్య–జ్యోత్స్న దంపతులు, న్యాయవాది అలేఖ్య నటేశ్వర్, ఎథిక్ అకాడమీ యాజమాన్యం, పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యం, శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, సతీష్ రావు, చౌదరి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందారు.
భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలు కాలనీలో పండుగ వాతావరణాన్ని నింపాయి. గణపతి బప్పా మోరియా నామస్మరణలతో సృష్టి ఎంక్లేవ్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

