మందమర్రి ఏరియాలో కార్మికులకు ఉచిత అల్పాహారం, తేనేటి విందు
గనులు, డిపార్టుమెంట్ల వద్ద కార్మికులతో ఏఐటీయూసీ సంబరాలు
పోరాట ఫలితాన్ని తమ ఖాతాలో వేసుకోవద్దని ఇతర సంఘాలకు హితవు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మణుగూరు డీప్ సైడ్ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ)ను సింగరేణి కాలరీస్కు కేటాయించిన సందర్భంగా మందమర్రి ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులకు ఉచిత అల్పాహారం, తేనేటి విందు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందమర్రి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్ మాట్లాడుతూ, కార్మికుల మద్దతుతో ఏఐటీయూసీ జెండా కింద చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే మణుగూరు డీప్ సైడ్ ఓసీపీని సింగరేణికి కేటాయించారని తెలిపారు. ఇది పూర్తిగా కార్మికుల విజయమన్నారు. మణుగూరు ఓసీపీని సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ చేపట్టిన నిరాహార దీక్షలు, ధర్నాలు, మెమోరాండాలు, సమ్మె నోటీసులు వంటి ఉద్యమాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ఈ విజయాన్ని కొందరు కార్మిక సంఘాలు తమ పోరాట ఫలితంగా ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు. ముఖ్యంగా ఐఎన్టీయూసీ నాయకులు ఈ కేటాయింపును తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సింగరేణి, కార్మికుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.53 వేల కోట్ల బకాయిలను ఇప్పించేందుకు కృషి చేయాలని సవాల్ విసిరారు.
కార్మికులను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రచారాలకు పాల్పడవద్దని, అలాంటి ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను కార్మికులు గుర్తిస్తారని అన్నారు. కార్మికుల హక్కులు, సింగరేణి పరిరక్షణ కోసం ఎర్రజెండా సంఘం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియాలోని కేకే–5 క్యాంటీన్, కేకే ఓసీ క్యాంటీన్, వర్క్షాప్ క్యాంటీన్, స్టోర్స్ క్యాంటీన్, జనరల్ మేనేజర్ కార్యాలయ క్యాంటీన్ల లో సింగరేణి ఉద్యోగులకు, కార్మికులకు ఉచిత అల్పాహారం, తేనేటి విందు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మర్రి కుమార్ స్వామి, సీహెచ్ శర్మ, సృజనా గీతిక, ఏరియా నాయకులు సోమిశెట్టి రాజేశం, ఎక్కేటి రాజేశ్వరరావు, గోపతి సత్యనారాయణ, హేమ పిట్ కమిటీ, సేఫ్టీ కమిటీ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

