BRS Plan in sccl : తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల్లో పోరుబాటకు బిఆర్ఎస్ సిద్ధమవుతోంది. బొగ్గుగనులను వేలం పాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో ఇటీవలనే వేలం పాటకు సంబందించిన నోటిఫికేషన్ సైతం విడుదల అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలం పాటలో పాల్గొంది. గడిచిన పదేళ్లలో కూడా వేలం పాటను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. అందుకు రాజకీయంగా అనేక కారణాలు సైతం ఉన్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారానికి దూరమైనది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా ఉనికిని చాటుకొని పార్టీ శ్రేణులను కాపాడు కుందామని ఆశ పడింది. కానీ ఆ ఆశలు నిరాశలే అయ్యాయి. ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి సింగరేణి ప్రైవేటీకరణ పేరుతో పోరుబాటకు సిద్దమైనది బిఆర్ఎస్.
సింగరేణి గనులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని బిఆర్ఎస్ ఆరోపణ. బొగ్గుగనుల వేలాన్ని వ్యతిరేకిస్తున్న గులాబీ పార్టీ సింగరేణిలో పోరుబాట చేపట్టాలని కార్యాచరణను సిద్ధం చేసుకొంది. ఇటీవలనే కేటీఆర్ సింగరేణి పరిధిలోని పార్టీ సీనియర్ శ్రేణులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముక్కైన నేపథ్యంలోనే వేలం పాటలో అధికార పార్టీ పాల్గొన్నదని కేటీఆర్ నాయకుల వద్ద ఆరోపించారు. లాభాల్లో ఉన్న సంస్థను అభివృద్ధి చేయకుండా, ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకించాలని ఆయన అన్నారు. వేలం పాటను అడ్డుకోడానికి సింగరేణి ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జూలై 1న సింగరేణి గనులు, డిపార్టుమెంట్ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన. జూలై 3న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం. జూలై 6న ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నా, వినతి పత్రం ఇవ్వడం. గోదావరిఖనిలో జూలై 9న భారీ ఎత్తున ధర్నా చేపట్టడం. ఆ తరువాత సింగరేణి ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం.హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర సింగరేణి కార్మికులతో ధర్నా.ఢిల్లీ లోని జంతర్మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం.