డీజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లకు అవగాహన, హెచ్చరిక
మందమర్రి ఎస్ ఐ నరేష్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు డీజేలకు పూర్తిగా దూరంగా ఉండాలని మందమర్రి ఎస్సై నరేష్ సూచించారు. శబ్ద కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా స్థానిక డీజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లకు అవగాహన కల్పించడంతో పాటు బైండ్ ఓవర్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.
మంగళవారం మందమర్రి పోలీస్ స్టేషన్లో డీజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లతో ఎస్సై నరేష్ అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా శబ్ద కాలుష్యం వల్ల ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడటం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.
గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా డీజేలను వినియోగించకూడదని ఆయన పేర్కొన్నారు. నిబంధనల మేరకు డీజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లను సంబంధిత చట్టాల కింద మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు.
నిబంధనలను ఉల్లంఘించి డీజేలను వినియోగిస్తే సదరు డీజే, సౌండ్ సిస్టం పరికరాలను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులు, ఆపరేటర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నరేష్ హెచ్చరించారు. ప్రజలు, భక్తులు, గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించి గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు.

