గని జీవిత కాలం 25 ఏళ్ళు
సింగరేణి అభివృద్ధికి ప్రధానం
హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక వర్గం
ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సంస్థకు నిన్న తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గని. నేడు మణుగూరు ఓపెన్ కాస్ట్ గని. ఈ రెండు గనులు సంస్థకు రావడంతో సింగరేణికి ఉపిరిపోసినట్టయ్యింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మణుగూరు-ఓసి (ప్రకాశం ఖని ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్) సింగరేణికే కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. దింతో కార్మిక వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రతిఏటా ఎదో ఒక ఏరియాలో గని మూత పడటం, కార్మికులు ఆ గని నుంచి మరో ప్రాంతానికి బదిలీ కావడం జరిగేది. ఈ నేపథ్యంలో కార్మిక కుటుంబాలు సైతం మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అదే విధంగా సంస్థ కూడా ఉత్పత్తి, ఉత్పాదకలో కూడా వెనుకబడి ఆర్థికంగా నష్టపోయేది. తాజాగా వెంట, వెంట రెండు గనులు రావడంతో సంస్థ ఆర్థికంగా బలోపేతం కాబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాడిచెర్ల, మణుగూరు ఉపరితల గనులు సింగరేణికి దక్కడంతో ఉత్పత్తి, ఉత్పాదక పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకొని సంస్థ మరిన్ని గనులు దక్కించుకునే అవకాశాలు సైతం కనబడుతున్నాయి. అదే విధంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయి. మణుగూరు ఓసి జెన్కో కు కేటాయిస్తున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు సింగరేణికే కేటాయిస్తున్నట్టుగా ఆదేశాలు రావడంతో కార్మిక వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.
మణుగూరు ఓసి గనిలో Longwall Belt Conveyor Maintenance పద్దతిలో 771.90 LBCM ఓవర్ బర్డెన్ పనులు చేపట్టనున్నారు. ఈ పనుల్లోనే 747.26 LBCM గట్టి ఓవర్ బర్డెన్ తో పాటు 24.64 LBCM బొగ్గు సైతం ఉంది. 771.90 LBCM పనుల అంచనా విలువ రూ. 1,044.66 కోట్లు. ఉంటుందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. గని జీవిత కాలం కనీసం 25 ఏళ్ల పాటు ఉంటుందని అధికార వర్గాల సమాచారం. గనిలో సుమారుగా 2500 కార్మిక, కార్మికేతరులు విధులు నిర్వహించే అవకాశాలు సైతం ఉన్నవి.

ఇది ఏఐటీయూసీ విజయం…వాసిరెడ్డి సీతారామయ్య…
సింగరేణి సంస్థకే బొగ్గు గనులు దక్కాలనే పట్టుదలతో తమ సంఘం చేపట్టిన పోరాటాల ఫలితంగానే మణుగూరు ఓసి దక్కిందని, ఇది ఏఐటీయూసీ విజయమని, ఈ విజయాన్ని కార్మికులకే అంకితం చేస్తున్నామని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మణుగూరు ఓసి సింగరేణికే కేటాయిస్తున్నట్టుగా ఉత్తర్వులు వచ్చిన సందర్బంగ ఆయన కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ ఓసి ని జెన్కో కు కేటాయించాలనే ఒప్పందాలను తమ సంఘం అంగీకరించలేదన్నారు. అవసరమైతే ఇదే నెలలో సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా సిద్దమైనమన్నారు. ఈ నేపథ్యంలోనే సంస్థకే కేటాయిస్తూ ఉత్తర్వులు రావడం జరిగిందన్నారు. మంగళవారం సింగరేణి గనులపై సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సంబరాల్లో కార్మిక వర్గం పాల్గొనాలని ఆయన కోరారు.

