NIGAMA MEDIA (P) LTD
20.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 17, 2026

అక్షిత రాణి మృతిపై సమగ్ర విచారణ జరపాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

మహిళా ఉద్యోగులపై వేధింపులను అరికట్టాలి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
రిటైర్డ్ కార్మికుల సంఘం, టీడీపీ నేతల డిమాండ్

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ విద్యలో భాగంగా తాండ్ర అక్షిత రాణి గోదావరిఖని ఆర్జీ-1 గనిలో శిక్షణ పొందుతున్న సమయంలో మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మందమర్రి రిటైర్డ్ కార్మికుల సంఘం, తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మందమర్రి రిటైర్డ్ కార్మికుల సంఘం నాయకుడు వాసాల శంకర్, టీడీపీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ మాట్లాడుతూ.. అక్షిత రాణిని గనిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. వేధింపుల కారణంగా ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సింగరేణి యాజమాన్యం, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తగిన స్పందన లభించలేదని వారు ఆరోపించారు.

అక్షిత రాణి మృతికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి, ఆమెను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితురాలు దళిత వర్గానికి చెందిన యువతి కావడంతో కేసులో వర్తించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని నిబంధనలను పరిశీలించి, ఆధారాల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వాసాల సంపత్ మాట్లాడుతూ.. అక్షిత రాణి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. గనులు, జీఎం కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్నారని చెబుతున్న మానసిక వేధింపులపై కూడా యాజమాన్యం దృష్టి సారించాలని అన్నారు.

మహిళా ఉద్యోగులను విధి నిర్వహణ సమయంలో అవమానించేలా లేదా ఇబ్బందులకు గురిచేసేలా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే, ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలు తేలిన అనంతరం చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేసే విధంగా ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోదావరిఖని, తాండూర్, కాజీపేట తదితర ప్రాంతాల్లోని సింగరేణి కార్యాలయాలు, గనుల్లో మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నాయకులు కోరారు. మహిళలపై వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై తక్షణమే విచారణ జరిపి, ఆరోపణలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నెల్లి వీరన్న, జక్కం రాజన్న, ఆసం కొమురన్న, దాసరి ఎల్లారం, వేల్పుల వెంకటి, సీహెచ్‌ గట్టయ్య, కుమ్ముల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.