మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
స్థానిక పాఠశాలలో మందమర్రి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో “సైబర్ క్రైమ్ – ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో సైబర్ నేరాలపై మందమర్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజురోజుకూ ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా లింక్లు లేదా ఇతర అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు.
అదేవిధంగా, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్లైన్కు ఫోన్ చేయడం లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ద్వారా త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లేష్, కానిస్టేబుళ్లు సంతోష్, విశ్వనాథ్, సురేందర్, హోంగార్డు శ్రావణ్ కుమార్,పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

