వేధింపులు సహించవద్దు..
వెంటనే షీ టీమ్స్ను ఆశ్రయించండి
ఎస్ఐ హైమా
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు చేపడుతోందని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ హైమా తెలిపారు. శనివారం మందమరిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో బాలికలకు నిర్వహించిన మహిళల భద్రత అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్ను ఆశ్రయించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా షీ టీమ్స్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో మహిళల భద్రతకు సంబంధించిన పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా షీ టీమ్స్ అందిస్తున్న సేవలు, మహిళల భద్రతా చర్యలు, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, ట్రాఫిక్ నియమాలు, టీ-యాప్ వినియోగం తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
సహాయం కోసం డయల్–100కు కాల్ చేయడంతో పాటు, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 63039 23700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 87126 59385లను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా మౌనంగా ఉండకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్ఐ హైమా సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు శ్రావణ్, శ్రీలత, కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

