డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయసుప్రజ
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):
ప్రజలకు తొలి వైద్య సహాయం అందించే ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు అత్యంత అవసరమని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయసుప్రజ అన్నారు. మందమర్రి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంఘ భవనంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సి.ఎం.ఈ.) అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జయసుప్రజ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, జ్వరాల నివారణ, ప్రాథమిక చికిత్స, ఆధునిక వైద్య విధానాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ప్రాథమిక చికిత్సలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఆధునిక వైద్య విధానాలు, డాక్టర్ రెడ్డీస్ సంస్థ తయారు చేస్తున్న ఔషధాల నాణ్యత, వినియోగం, ప్రభావం గురించి ఆమె వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు తక్షణం అందుబాటులో లేని పరిస్థితుల్లో తొలి వైద్య సహాయం అందించే వైద్యులకు నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా మందమర్రి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డాక్టర్ జయసుప్రజను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదాసు శంకరయ్య, మందమర్రి పట్టణ అధ్యక్షుడు గోనె గోవర్ధన్, గౌరవాధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంద తిరుమలరెడ్డి, ప్రధాన కార్యదర్శి అడ్డూరి సాంబమూర్తి, కోశాధికారి వేముల నరసయ్య, ఉపాధ్యక్షులు గాజుల శంకర్, చింతల పోశం, పానుగంటి పరమాత్మ, నర్సింగోజు, తిరుపతి, గోలి సత్యం, మతీన్ ఖాన్, విజయ్ శర్మ ఖాన్, గోరె శ్రీనివాస్, తిప్పని శ్రీనివాస్తో పాటు పలువురు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు పాల్గొన్నారు.

