భ్రమరాంబాదేవికి సారె పెట్టడానికి కాలినడకన భక్తులు
మల్లన్న దర్శనం ఉగాదిరోజు పవిత్రమైనది
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం
కోల్ బెల్ట్ న్యూస్:శ్రీశైలం
శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు శనివారం ప్రారంభమైనాయి.ఈ వేడుకలకు సుమారు పదిలక్షల పైబడి భక్తులు తమ మొక్కులు తీర్చుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు,పాలకవర్గం అంచనా వేస్తోంది.దర్శనం కోసం వేచిఉండే భక్తులకు అల్పాహారం,తాగునీరు ఉత్సవాలు ముగిసేవరకు అందించనున్నారు.కాలినడకన వచ్చే భక్తులకు దారిలో తాగునీరు, పందిళ్లు, వైద్యసదుపాయాలు ఏర్పాటుచేసింది ఆలయ కమిటీ.భక్తులు కోరినన్ని లడ్డు ప్రసాదాన్ని ఇవ్వనున్నారు.అభిషేకా లు,సర్వదర్శనాలను ఉత్సవాల నేపథ్యంలో ప్రస్తుతానికి నిలిపివేసింది దేవాలయం కమిటీ.శనివారం నుంచి వరుసగా ఐదురోజుల పాటు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి.యాగశాల ప్రవేశంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఉత్సవాలు ప్రారంభమైన మొదటిరోజు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చి ఆశీర్వదించ నున్నారు.ఇదేరోజు రాత్రకి బృంగివాహనంపై శ్రీశైలం పురవీధులలో భక్తులకు మల్లికార్జునస్వామి,పార్వతీదేవి దర్శనం కానున్నారు.
ఐదురోజులు ఐదు అవతారాల్లో అమ్మవారు
మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని మొదటి రోజు భ్రమరాంబాదేవి మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. రెండో రోజు శ్రీశైలం అమ్మవారు మహాదుర్గ దేవి అవాతారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది.మూడోరోజు భ్రమరాంబదేవి చదువుల తల్లి సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఆశీర్వదించనున్నారు.నాలుగోరోజు ఉగాది పండుగ పురస్కరించుకొని అమ్మవారు రమావాణి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులను ఆశీర్వదించనున్నారు.ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఐదోరోజు భ్రమరాంబదేవి అమ్మవారు నిజ అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంది.శ్రీశైల మల్లన్న, భ్రమరాంబిక దేవి అమ్మవారు నంది ఆసీనులై వాహనంలో మేళతాళాల వాయిద్యాలతో కోలాటాల ఆటపాటలతో భాజాబజంత్రీలతో, భక్తుల నృత్యల నడమ ఆలయ పురవీధులలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.చివరిరోజు అశ్వవాహనంలో మల్లికార్జునస్వామి, పార్వతీదేవి భక్తులకు దర్శనమితారు.
తండోపతండాలుగా తరలివస్తున్న కన్నడ భక్తులు
శ్రీ భ్రమరాంబ దేవిని కర్ణాటక రాష్ట్రం వాసులు ఆడపడుచుగా భావిస్తారు.ఉగాది ఉత్సవాల్లో భాగంగా కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి కర్నూలు మీదుగా ఆత్మకూరు చేరుకొని వెంకటాపురం అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ కొండలు కోనలు దాటుకొని శ్రీశైలానికి చేరుకుంటారు.ఈ ఏడాది భ్రమరాంబదేవి సన్నిధికి కన్నడ భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.కన్నడిగులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.తమ ఆడపడుచు శ్రీ భ్రమరాంబ అమ్మవారికి సారే సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తున్నారు.ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలంలో ఐదు రోజులపాటు భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఉగాది పర్వదినం కావడంతో కన్నడిగులు శివదీక్షా శిభిరాలలో రాత్రి వీరాచార విన్యాసాలుచేస్తారు. అదేవిదంగా అగ్నిగుండ ప్రవేశంతో అమ్మవారు మా అందులో ఉన్నారంటూ దీక్షచేస్తారు.కన్నడిగులు భక్తి ప్రపత్తులతో అగ్నిగుండ ప్రవేశం చేసి నిప్పుకనికులలో నడుస్తూ తమ భక్తిని చాటుకుంటారు.