పెద్దపల్లి జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలి
టిఆర్ఎస్ పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు పెద్దపల్లి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నిర్వహించనున్న ఈ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. కొడంగల్ కేంద్రంగా నిర్వహించే ఈ సభకు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా భారీగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, యువతకు ఉద్యోగాలు, విద్య, వైద్యం తదితర అంశాలపై సభలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించనున్నట్లు సభ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి వివిధ వర్గాల ప్రజలు సమన్వయంతో సభకు తరలిరావాలని కోరారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయని తెలిపారు.

