కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
శాంతిఖని గనిలో ఒక్కరోజు గైర్హాజరైన కార్మికుడు నాగాకు వివరణ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం లేఖ జారీ చేయడం సరికాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, సింగరేణిలోని ఇతర ఏ గనిలోనూ లేని విధంగా శాంతిఖని గనిలో మాత్రమే వివరణ కోరుతూ లేఖ ఇవ్వడం సమంజసం కాదన్నారు. అనివార్య కారణాల వల్ల ఒక్కరోజు విధులకు హాజరుకాలేకపోతే కార్మికుడిని వివరణ కోరడం సరైన విధానం కాదని, ఈ నిర్ణయంపై యాజమాన్యం పునరాలోచించాలని కోరారు.
గనుల్లో గైర్హాజరు శాతాన్ని తగ్గించాలన్న యాజమాన్యం ఉద్దేశం మంచిదేనని, అయితే ఇలాంటి చర్యల వల్ల విధులు క్రమం తప్పకుండా నిర్వహించే కార్మికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వెంకటస్వామి పేర్కొన్నారు. అనుకోని పరిస్థితుల కారణంగా గైర్హాజరు కావడం, అధికారులు సెలవు మంజూరు చేయకపోవడం, విశ్రాంతి (రెస్ట్) నమోదు సరిగా లేకపోవడం వంటి కారణాలతో కూడా కార్మికులకు వివరణ లేఖలు జారీ అవుతున్నాయని తెలిపారు.
ఇలాంటి పరిణామాలు పారిశ్రామిక అశాంతికి దారితీసే అవకాశం ఉందని, ప్రస్తుతం గనుల్లో ఉత్పత్తి పుంజుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అనవసర ఆంక్షలు విధించకుండా కార్యకలాపాలు సజావుగా కొనసాగేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికులతో చర్చించి ఉత్పత్తి పెంపునకు దోహదపడే నిర్ణయాలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి వెంకటస్వామి సూచించారు.

