సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, దుష్ప్రచారానికి ఇక చెక్
అనుచిత పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సోషల్ మీడియా వేదికగా ఏఐటీయూసీ నాయకులతోపాటు, బాధ్యులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు, అసభ్య ప్రచారం, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా పోస్టులు, ఫొటోలు, వీడియోలను ప్రచారం చేయవద్దని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) మందమర్రి నాయకులు భీమనాదుని సుదర్శన్, సలేంద్ర సత్యనారాయణ సూచించారు. ఈ సందర్బంగా వారు మందమర్రి యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ …
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, విమర్శలకు స్థానం ఉందని, అయితే వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారం, అవమానకర వ్యాఖ్యలు మాత్రం ఆమోదయోగ్యం కాదని వారు పేర్కొన్నారు. కొందరు సోషల్ మీడియాలో ఏఐటీయూసీ నాయకులపై అవమానకరంగా దుష్ప్రచారం చేస్తున్న పోస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరంగా దుష్ప్రచారం చేసిన పోస్టులపై సంబంధిత వ్యక్తుల వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోస్టు చేసే ముందు ఆలోచించాల్సిందిగా వారు కోరారు.
“నేను తయారు చేయలేదు.. కేవలం ఫార్వర్డ్ చేశాను” అంటూ బాధ్యత నుంచి తప్పించుకోలేరని ఏఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు. పోస్టులు, ఫొటోలు, వీడియోలను షేర్ చేసే ముందు వాటి నిజానిజాలను పరిశీలించాలని, వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దని సూచించారు. ఎవరి గౌరవానికీ భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కంటెంట్ ప్రచారం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా జరిగే దుష్ప్రచారంపై అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు.

