కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ముద్రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు అన్నారు. సెప్టెంబర్ 17 కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, హైదరాబాద్ సంస్థానం చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన రోజని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిబిపేట్ మండలానికి చెందిన ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలంటే 1947–48 కాలంలో హైదరాబాద్ సంస్థానంలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ విలీనం కాలేదు
1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన సమయంలో హైదరాబాద్ సంస్థానానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం పాలకుడిగా ఉన్నారు. హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత తెలంగాణ ప్రాంతంతో పాటు ప్రస్తుత మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కలిగి ఉన్న విస్తారమైన సంస్థానంగా ఉండేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం వెంటనే భారత యూనియన్లో విలీనం కాలేదని, నిజాం ప్రభుత్వం ప్రత్యేకంగా కొనసాగేందుకు ప్రయత్నించిందని వారు వివరించారు.
ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉద్యమాలు
ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో ప్రజాస్వామ్య హక్కులు, రాజకీయ స్వేచ్ఛ, బాధ్యతాయుత ప్రభుత్వం కోసం డిమాండ్లు క్రమంగా బలపడ్డాయని డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ తెలిపారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ వంటి సంస్థలు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ప్రజలకు తమ హక్కులు, స్వేచ్ఛ కోసం గొంతెత్తే అవకాశం కల్పించేందుకు అనేక ఉద్యమాలు సాగాయని, ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం ప్రజలు పోరాటాలు నిర్వహించారని ఆయన వివరించారు.
సామాజిక, ఆర్థిక సమస్యలపై రైతాంగ పోరాటం
అదే సమయంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వెట్టిచాకిరి, భూస్వామ్య దోపిడీ, అధిక పన్నులు, సామాజిక అసమానతలు వంటి సమస్యలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం కూడా బలపడిందన్నారు. దీంతో హైదరాబాద్ సంస్థాన చరిత్ర కేవలం ఒక రాజకీయ పరిణామానికి మాత్రమే పరిమితం కాదని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కుల కోసం సాగిన వివిధ పోరాటాలతో ముడిపడి ఉందని తెలిపారు. తెలంగాణ చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు అప్పటి రాజకీయ పరిణామాలతో పాటు సామాన్య ప్రజల జీవన పరిస్థితులు, వారి హక్కుల కోసం సాగిన ఉద్యమాలు, సామాజిక–ఆర్థిక సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సెప్టెంబర్ 17ను చారిత్రక నేపథ్యంతో అర్థం చేసుకుని, ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రజాస్వామ్య హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం సాగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్, కొరివి నర్సింలు పేర్కొన్నారు.

