అదనపు కలెక్టర్ చంద్రయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అధికారులను ఆదేశించారు.
మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, డీఈఈ, ఏఈ, కౌన్సిలర్లతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం, అమ్మ గార్డెన్ ప్రాంతంలోని సీసీ రోడ్లు, డ్రైన్లు, వైకుంఠధామం పనుల పురోగతిని సమీక్షించారు. ప్రజలకు తాగునీరు, మౌలిక సదుపాయాలు మెరుగ్గా అందేలా పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.
మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచి ప్రధాన రహదారులు, నివాస, వాణిజ్య ప్రాంతాల్లో నిరంతరం పరిశుభ్రత ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెత్త సేకరణ, తరలింపు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గడువు ముగిసిన ట్రేడ్ లైసెన్సులను నిబంధనల ప్రకారం వెంటనే పునరుద్ధరించాలని, అన్ని వాణిజ్య సంస్థల లైసెన్సుల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ను ఆదేశించారు.
కూరగాయల మార్కెట్ను సందర్శించి వ్యాపారులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో అదనపు గదుల నిర్మాణ పనులతో పాటు పెన్షన్ ఫైళ్ల పురోగతిని సమీక్షించారు. పెన్షన్ దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

