మందమర్రిలో తల్లిపాల వారోత్సవాలు
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యత, అనుబంధ పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) రావుఫ్ ఖాన్ తెలిపారు. మందమర్రి మండలంలోని సండ్రోనిపల్లె లో నిర్వహించి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన అనుబంధ పోషకాహారం గురించి వివరించారు.
చిన్నారులకు తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అత్యుత్తమ ఆహారమని, ఆరు నెలలు పూర్తైన అనంతరం తల్లిపాలతో పాటు పోషక విలువలు కలిగిన అనుబంధ ఆహారాన్ని అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పడుతుందని సూచించారు.ఈ సందర్భంగా ఆరు నెలలు నిండిన చిన్నారులకు సీబీఈ (CBE) ఈవెంట్, అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ అశోక్, డీపీఏ (పోషణ్ అభియాన్) శ్యామల, సర్పంచ్ పెరుమాండ్ల వెంకటేష్, ఉపసర్పంచ్ మణితేజ్, పంచాయతీ కార్యదర్శి హిమబిందు, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు సంధ్య, పద్మావతి, గంగాదేవి, స్వరూప, సరోజ, వసంత, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

