మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో జయంతి వేడుకలు
ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఉద్యోగులకు పిలుపు
మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగం పేర్కొన్నారు. గురువారం మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా చాటి చెప్పడంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయడంలో ఆచార్య జయశంకర్ పాత్ర చిరస్మరణీయమని అన్నారు.
తెలంగాణ సాధన, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప విద్యావేత్త, మేధావి, ఉద్యమకారుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాల పాటు నిరంతరం పోరాడుతూ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సమాజానికి వివరించి ప్రజల్లో చైతన్యం నింపిన మహోన్నత వ్యక్తిత్వం ఆచార్య జయశంకర్దని గుర్తు చేశారు.
ఆచార్య జయశంకర్ ఆశయాలు, విలువలు, నిబద్ధత నేటి తరాలకు ఆదర్శమని, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాసేవ లక్ష్యాల సాధనకు ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కమిషనర్ రాజలింగం పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజాసేవనే ధ్యేయంగా చేసుకుని, ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సాయికిరణ్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టీ. వినీత్, మేనేజర్ టీ. రాజేశ్వరి, సీనియర్ అసిస్టెంట్లు ఏ. రాణి, ఈ. రాజేశ్వరి, జూనియర్ అకౌంటెంట్ వెంకటేష్, ఇన్చార్జ్ టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్ ఏ. రఘురాం, వార్డు అధికారులు, సిస్టమ్ మేనేజర్ ఏ. శిరీష, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. గోపీకృష్ణ, ప్రాసెసింగ్ ఆఫీసర్ బి. శ్యాంబాబు తదితర మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు పాల్గొని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్కు ఘనంగా నివాళులర్పించారు.

