హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు షాక్
పదవి నుంచి తొలగించాలని ఆదేశం
63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు కీలక ఆదేశాలు
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ధిక్కరిస్తున్నారనే అభిప్రాయంతో ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును హైకోర్టు ఆదేశించింది. రంగనాథ్పై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్లో ఉండటంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక ఉన్నతాధికారిపై ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వచ్చాయని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలోని 40 ఎకరాల భూవివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో రంగనాథ్ బేషరతుగా క్షమాపణలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి గౌరవం ఉందని, వివాదాస్పద స్థలంలో హైడ్రా జోక్యం చేసుకోలేదని, పిటిషనర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

