సక్రమంగాలేని ప్రభుత్వ మార్గదర్శకాలు, బీఎల్ఓ సూచనలు
ఎంసీపీఐయూ నేత పసులేటి వెంకటేష్ ఆందోళన
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
ప్రభుత్వాలు చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వాలు చెబుతున్న నిబంధనలకు, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు ప్రజలకు సూచిస్తున్న వివరాలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం సూచించిన 11 పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పిస్తే సరిపోతుందని చెబుతున్నప్పటికీ, బీఎల్ఓల వద్దకు వెళ్లినప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు తదితర అదనపు పత్రాలను తీసుకురావాలని కోరుతున్నారని వెంకటేష్ ఆరోపించారు. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతూ, పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే పత్రాల స్వీకరణ చేపట్టాలని ఆయన కోరారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయూ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్ పాల్గొన్నారు.

