భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు
పాల్గొన్న బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్ దంపతులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని పాలచెట్టు వద్ద ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించి, అనంతరం ప్రత్యేక అలంకరణ, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. వేదమంత్రాల నడుమ శ్రీకృష్ణకాంత్ ఆచార్య స్వామివారిని కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల ఆధ్యాత్మిక నినాదాలతో మార్మోగింది. ఈ ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్ దంపతులు, మందమర్రి ఎస్ఐ నరేష్ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆచార్యులు మాట్లాడుతూ శ్రావణమాసంలో ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత, మనోధైర్యం కలుగుతాయని తెలిపారు. “సర్వేజనా సుఖినో భవంతు.. అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి” అని ఆకాంక్షించారు. శ్రావణమాసం మొత్తం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

