రెండు దశాబ్దాలుగా ప్రజలను వేధించిన సమస్యకు
సింగరేణి జీఎం రాధాకృష్ణ ఆదేశాలతో వేగంగా పనులు
మంత్రి వివేక్ చొరవతో పనుల ప్రారంభం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి పట్టణంలోని 17వ వార్డులో గత రెండు దశాబ్దాలుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సేవరేజ్ లైన్, డ్రైనేజీ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 17వ వార్డులో పర్యటించిన సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీ, సేవరేజ్ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించిన మంత్రి, ఆ ప్రాంతం సింగరేణి పరిధిలో ఉండటంతో సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణను వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాలకు స్పందించిన సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేయగా, అధికారులు వెంటనే పనులను ప్రారంభించారు. దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడటంతో 17వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మంత్రి ఆదేశాలను వెంటనే అమలు చేస్తూ పనులు ప్రారంభించిన సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణతో పాటు సంబంధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
.

