వడ నుంచి లడ్డూ వరకు ఆసక్తికర ప్రయాణం
మొదట వడ, తర్వాత బూందీ
కాలక్రమేణా లడ్డూగా రూపాంతరం
1803లో బ్రిటిష్ పాలనలో ప్రసాదాల విక్రయానికి శ్రీకారం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి లభించే లడ్డూ ప్రసాదం వెనుక మూడు శతాబ్దాలకుపైగా చరిత్ర దాగి ఉంది. నేడు శ్రీవారి లడ్డూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, తొలినాళ్లలో భక్తులకు లడ్డూ ప్రసాదం అందించేవారు కాదు. సుమారు 310 ఏళ్ల క్రితం తిరుమల ఆలయంలో భక్తులకు ప్రసాదాల పంపిణీ ప్రారంభమైంది. అప్పట్లో స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు **”వడ”**ను ప్రసాదంగా అందించేవారు. అనంతరం కొంతకాలానికి వడ స్థానంలో “బూందీ” ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించారు.
కాలక్రమేణా ఆలయ సంప్రదాయాలు, భక్తుల సంఖ్య, నిర్వహణ అవసరాలకు అనుగుణంగా బూందీ స్థానంలో లడ్డూ ప్రసాదాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేకమైన రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం, సులభంగా పంపిణీ చేసే అవకాశం ఉండటంతో లడ్డూ తిరుమల ప్రసాదంగా స్థిరపడింది. నేడు ఈ లడ్డూ శ్రీవారి మహాప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది.
చారిత్రక ఆధారాల ప్రకారం, 1803 సంవత్సరంలో బ్రిటిష్ పాలన కాలంలో తిరుమలలో ప్రసాదాల విక్రయ విధానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి భక్తులు ప్రసాదాన్ని కొనుగోలు చేసుకునే వ్యవస్థ అమలులోకి వచ్చింది. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటుతో ప్రసాదాల తయారీ, నాణ్యత, పంపిణీ విధానాల్లో అనేక మార్పులు చోటుచేసుకుని, లడ్డూ ప్రసాదం తిరుమల ఆలయానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. నేడు తిరుమల శ్రీవారి లడ్డూ కేవలం ఒక ప్రసాదమే కాదు.. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రతీకగా నిలుస్తూ తిరుమల మహిమను ప్రపంచానికి చాటుతోంది.

