తెలంగాణాలో కేబినెట్ విస్తరణపై ప్రచారం
ఖాళీగా రెండు మంత్రి పదవులు
ఆశిస్తున్న వారు ఎక్కువే
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు జరుగబోతున్నాయా ? ఖాళీగా ఉన్న రెండు బెర్తుల కోసం ఆశిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే కనబడుతోంది. అయితే ఖాళీలను భర్తీ చేయడానికి ఢిల్లీ పెద్దలు అంగీకరించారా ? ఒకవేళ రెండు బెర్తులను భర్తీ చేస్తే, అదేసమయంలో ప్రస్తుతం ఉన్న శాఖలకు పునర్విభజన సైతం ఉంటుందా ? ఇటువంటి అంశాలపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో పరిపాలన పగ్గాలు చేతపట్టింది. సీఎం గా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగం నిబంధనల మేరకు 18 మందికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. 2025 జూన్ 8న మొదటిసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దింతో మంత్రుల సంఖ్య 15 కు చేరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మహ్మద్ అజారుద్దీన్కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. సీఎం తో కలిపి మొత్తం 16 కు మంత్రుల సంఖ్య చేరింది. ఈ నేపథ్యంలో ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది.
మంత్రివర్గంలో మిగిలిన రెండు పదవులపై పార్టీలో చర్చ నడుస్తోంది. బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వర్గం ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తోంది. కేబినెట్ లో తగిన ప్రాతినిధ్యం లేదనే భావన కాంగ్రెస్ పెద్దల దృష్టిలో ఉంది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి మంత్రి పదవి కేటాయిస్తే ఆది శ్రీనివాస్ మంత్రి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీనివాస్ కు అవకాశం దక్కే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు లంబాడీ సామజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది.
అదేవిదంగా శాఖల పునర్ వ్యవస్థీకరణ సైతం జరిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. కొందరి శాఖల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులపై అధిష్ఠానం అతి తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

by