కవితను కలిసిన కరస్పాండెంట్
కార్యాలయం ఖర్చులు తానే భరిస్తాను
అవకాశం ఇస్తే మంచిర్యాల నుంచి పోటీ
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవికి ప్రముఖ విద్యాసంస్థల అధినేత ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా రంగంలో ఆయనకు పట్టు ఉండటంతో జిల్లాలో ఆయనకు ఒక గుర్తింపు ఉంది. సింగరేణి కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలో విద్యాసంస్థలను ప్రారంభించి కొంతమేరకు పట్టు సంపాదించుకున్నారు.
పార్టీ వ్యవస్థాపకురాలు కవితను ఆయన కలిసి చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతే కాకుండా అధ్యక్ష భాద్యతలు అప్పగిస్తే పార్టీ జిల్లా కార్యాలయాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తానని కవితకు హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల సమాచారం.
జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేతో కూడా అయన పార్టీ భవిష్యత్తుపై చర్చించినట్టు సమాచారం. పార్టీ అధ్యక్ష పదవి చేపడితే ఎలా ఉంటుందనే విషయాన్నీ ఆయన ఆ మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడినట్టుగా తెలిసింది. యువతను తనకు అండగా నిలిచే విధంగా పావులు కదుపుతున్నారు. పార్టీ అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల నుంచి బరిలో ఉంటానని కూడ కవితతో ఒక మాటగా చెప్పినట్టు సమాచారం.
ఏది ఏమైనప్పటికి మంచిర్యాల జిల్లాలో విద్యాసంస్థల అధినేతలు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావడం చర్చనీయాంశం అయ్యింది. 2023 ఎన్నికల్లో కూడా మంచిర్యాలకు చెందిన ఒక కరస్పాండెంట్ ఎమ్మెల్యేగా పోటీకి ఆసక్తి చూపారు. మంచిర్యాల జిల్లా నుంచి విద్యాసంస్థ అధినేతగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన మొట్టమొదటి వ్యక్తి నల్లాల ఓదెలు. ఆయన స్పూర్తితో జిల్లాలోని పలు విద్యాసంస్థల నిర్వాహకులు కూడా ఎమ్మెల్యే పదవి కోసం ఉవ్విల్లూరడటం కొసమెరుపు.

by