పగలంతా జై సుమనన్న
రాత్రయితే మాజీ ఎమ్మెల్యేతో మంతనాలు
చెన్నూర్ లో మరచిపోని రాజకీయ ప్రేమలు
కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల) : చెన్నూర్ నియోజకవర్గంకు చెందిన ఒక సీనియర్ నాయకుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు ఆయన వెన్నంటి ఉన్నారు నియోజకవర్గంకు చెందిన నాయకులు. అప్పుడు ఎమ్మెల్యే వెంట తిరిగిన నాయకుల్లో కొందరు ఇప్పుడు గులాబీ నేతలు. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే….రాజకీయంగా ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ, కలిసి తిరిగిన రాజకీయ ప్రేమాభిమానాలను ఆ నాయకులు మరచిపోలేక పోతున్నారు. ఆ గులాబీ నేతల్లో కొందరు నేతలు పగలంతా జై సుమనన్న అంటున్నారు. రాత్రయితే నియోజకవర్గంకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేతో ఆ నేతలే మంతనాలు జరుపుతున్నారు. ఇది చూసిన కొందరు ఇతర పార్టీల నేతలు చెవులు కొరుకుంటున్నారు. ఎంతయినా రాజకీయ ప్రేమను మరచిపోలేకపోతున్నారంటూ గుసగుసలు మొదలైనాయి. చెన్నూర్ నియోజకవర్గంకు చెందిన పలువురు గులాబీ తమ్ముళ్లు గోడమీద పిల్లుల్లా తయారైనారని కూడా పలు పార్టీల నేతలు నవ్వుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనేక కష్టాలను తట్టుకొని తన నియోజకవర్గంలోని రెండు మున్సి పాలిటీల్లో ఒక మున్సిపాలిటీ క్యాతనపల్లిని దక్కించుకున్నారు. ఒకవైపు పార్టీ సమావేశాలతో ఆయన తీరికలేకుండా గడుపుతున్నారు. మరోవైపు పోలీస్ కేసులు. వీటన్నిటిని తట్టుకొని అయన వీలైనంత మేరకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు మాత్రం గులాబీ నేతలు జై సుమనన్న,….చెన్నూర్ టైగర్….సుమనన్న,…. చెన్నూర్ అభివృద్ధి…. సుమనన్నతోనే సాధ్యం…. అంటూ నినాదలు చేస్తున్నారు. దింతో ఆ నినాదాలు విన్న సుమన్ తెగ సంబరపడిపోతున్నారు.
అయితే బాల్క సుమన్ మాత్రం అక్కడే పప్పులో కాలేస్తున్నారు. చూడటానికి గులాబీ పూలు చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి. సువాసన బాగానే ఉంది. కానీ ఆ పూల వెనుక ఉన్న ముళ్ళను బాల్క సుమన్ పసిగట్టలేకపోతున్నారని కొందరు గులాబీ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమన్ వచ్చినప్పుడు ఆయన వెంట ఉంటున్నారు. కానీ సుమన్ నియోజకవర్గంలో లేని సమయంలో నియోజకవర్గానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యేతో రాత్రి పూట మంతనాలు జరుపుతున్నారు. ఈ మంతనాల మర్మం ఎక్కడికి దారి తీస్తుందో తెలియదంటున్నారు కొందరు రాజకీయ శ్రేణులు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాజీ ఎమ్మెల్యేతో ఆనందంగా కొందరు గులాబీ నేతలు గడపటం తెలిసి ఇతర గులాబీ శ్రేణులు అసహనం వ్యక్తం చేయడం కొసమెరుపు.

by