Education : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉండేవి. ఇందులో సగానికిపైగా మారుమూల ప్రాంతాలే. అయినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అప్పుడు కూడా జిల్లా ఉన్నతాధికారులకు సమస్యలు ఎదురైనాయి. పరిష్కరించారు. మంచిని ఆశీర్వదించారు. చెడును ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో మంచిర్యాల జిల్లా ఒకటి. ఈ జిల్లాలో చెప్పుకోదగిన మారుమూల మండలాలు రెండే రెండు. ఒకటి కోటపల్లి, రెండోది వేమనపల్లి మండలం. మిగతా వన్నీ కూడా జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల లోపు ఉన్నవే.
ఇంత తక్కువ పరిధిలో కూడా విద్యాశాఖలో పర్యవేక్షణ లోపం కనబడుతోందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది కిందటి వరకు మంచిర్యాల జిల్లాల్లో రెండు నుంచి నాలుగు మండలాలకు ఒక ఎంఇఓ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ సమస్య తీరిపోయింది. మంచిర్యాల జిల్లాలో ఉన్నవి 18 మండలాలు. పూర్తి స్థాయిలో మండల విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారి ఉన్నారు. అయినా వ్యవస్థలో ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతూనే ఉంది. ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి తల్లి దండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి మంచిర్యాల జిల్లలో ఏర్పడింది.
గడిచిన కొద్దీ రోజుల్లోనే మంచిర్యాల జిల్లాలోనే మూడు సంఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లా కేంద్రంలోనే సత్యనారాయణ అనే తెలుగు పండిట్ ఉపాద్యాయుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించి, చెప్పుదెబ్బల పాలయ్యాడు. ఇతడి వేషధారణ చూస్తే దసరా బుల్లోడు సినిమా గుర్తుకు వస్తుంది. అధికారులు సస్పెండ్ చేశారు. ఆ తరువాత భీమిని మండలంలో పనిచేస్తున్న ఉపాద్యాయుడు రమేష్ కూడా తన పాఠశాలలో చదివే విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. తాజాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఉపాద్యాయుడు శ్రీనివాస్ కూడా అదే పాఠశాల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్థించారు. అయన చేసిన తప్పును బయటపెట్టకుండా దాచడానికి ప్రయత్నించారు తోటి ఉపాధ్యాయులు కొందరు.
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు ఉపాధ్యాయులు కామాందులుగా మారడంతో ఉపాధ్యాయ వ్యవస్థపై చెడు ప్రభావం పడింది. కామాంధుడి అవతారం ఎత్తిన వారికి కొందరు వత్తాసు పలకడం కూడా వ్యవస్థను విమర్శల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు నిందల పాలవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతోందని ఒకవైపు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి కామాంధులు ఉన్న చోట విద్యార్థులు ఎలా ప్రభుత్వ పాఠశాలకు వస్తారని కూడా తల్లి తండ్రులు ప్రశ్నిస్తున్నారు.
తక్కువ విస్తీర్ణంలో ఉన్న జిల్లాలో కూడా అతి తక్కువ కాలంలోనే మూడు సంఘటనలు జరిగాయంటే వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందనే ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థుల తల్లి దండ్రులు నేరుగా వచ్చేసి బదిలీ సర్టిఫికెట్ అడుగుతున్నారంటే, విద్యావ్యవస్టపై ఎంత నమ్మకం ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ విషయంపై డీఈఓ యాదయ్యను వివరణ కోరగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైన వెంటనే ప్రాధ్యానోపాధ్యాయుడి దృష్టి కి తీసుకు రావాలని చెబుతున్నాం. సమస్య ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో అనే విషయాలపై విద్యార్థులను చైతన్యపరుస్తున్నాం. అందుకు తగిన విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. ఎంఈఓ, తాను నిత్యం ఎదో ఒక పాఠశాలను పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం. ఫిర్యాదులు అందుతే ఉపాధ్యాయులపై వెంటనే శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాం.