కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో సోమవారం సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ ప్రజలకు సమగ్ర భూ సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదు విధానం, సర్వే నిర్వహణ ఉద్దేశాలు, తద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
సమగ్ర భూ సర్వే ద్వారా గ్రామంలోని భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్యానికి సంబంధించిన వివరాలను పకడ్బందీగా నమోదు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. భూ రికార్డుల్లో వివరాల నమోదు, భూముల హద్దుల నిర్ధారణ వంటి అంశాల్లో సర్వే కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్లో భూ సంబంధిత సమస్యలను తగ్గించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతులకు అందే సేవలు మరింత పారదర్శకంగా అందించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని వివరించారు.
సర్వే సమయంలో రైతులు, భూ యజమానులు తమ భూములకు సంబంధించిన సరైన వివరాలు, అవసరమైన పత్రాలను అందుబాటులో ఉంచి అధికారులకు సహకరించాలని సూచించారు. సర్వే సిబ్బంది గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉండి, తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని కోరారు. సమగ్ర భూ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు గ్రామ ప్రజలు సమన్వయంతో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన సదస్సులో ఏ.డీ. శ్రీనివాస్, డిప్యూటీ ఎం.ఆర్.ఓ. సంతోష్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

