కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
పత్తి పంటలో పంటల సరళి, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆదిల్పేట గ్రామంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పత్తి ఉత్పాదకత మిషన్ (ఎంసీపీ) కింద నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ పత్తిలో సరైన పంటల సరళి, అంతర పంటల ప్రాధాన్యత, నేల ఆరోగ్య పరిరక్షణపై రైతులకు వివరించారు. సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, శాస్త్రీయ సాగు పద్ధతులతో దిగుబడితో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.
ఒకే పంటపై ఆధారపడొద్దు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం అసమానంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని సూచించారు. పత్తితో పాటు కంది, పెసర, మినుము, సోయాబీన్ వంటి పంటలను సాగు చేయడం ద్వారా వాతావరణ ప్రతికూలతల వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. నీటి లభ్యత, స్థానిక వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. రాజశేఖర్, ఉప సర్పంచ్ కొట్రంగి రాజన్న, కృషి సఖిలు వసంత, లిఖితతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

