రవీంద్రభారతిలో ఘనంగా సన్మానం
సాహితీవేత్తలు, అతిథుల సమక్షంలో బహుమతి, పురస్కారం
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
తెలుగు సాహితీవనం సంస్థ నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీలో రచయిత కథ ఎంపికై, నగదు బహుమతితో పాటు ప్రతిష్ఠాత్మక కథా పురస్కారాన్ని మందమర్రికి చెందిన రచయిత సొతుకు రత్నజానకి అందుకున్నారు. తెలుగు సాహితీవనం సంస్థ 9వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం (జూలై 26, 2026) హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కథల పోటీల విజేతలుగా నిలిచిన రత్నజానకితో పాటు పలువురికి నగదు బహుమతులు, పురస్కారాలను నిర్వాహకులు అందజేశారు.
కార్యక్రమానికి తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు, ఐఏఎస్ అధికారి డా. ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ నవలా రచయిత డా. అంపశయ్య నవీన్, సాహితీవేత్తలు డా. పెద్దింటి అశోక్, డా. ఎస్. చంద్రయ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రచయిత సొతుకు రత్నజానకి తన సాహిత్య సంపుటాలను వారికి అందజేశారు.

అదేవిధంగా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా, టీవీ, సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, సీనియర్ జర్నలిస్టు సత్యాజీ, తోట అరుణ, తంగెళ్ల శ్రీదేవి మరియు తెలుగు సాహితీవనం సంస్థ అధ్యక్షురాలు శాంతికృష్ణ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని రచయిత రత్నజానకి ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలిపారు. తన కథను ఎంపిక చేసి, పురస్కారానికి అర్హురాలిగా గుర్తించిన తెలుగు సాహితీవనం సంస్థ అధ్యక్షురాలు శాంతికృష్ణతో పాటు సంస్థ నిర్వాహకులు, న్యాయనిర్ణేతలు, కార్యక్రమ నిర్వహణలో భాగమైన ప్రతి ఒక్కరికీ రచయిత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

