కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరి నాట్లను ప్రారంభించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలోని పలు చెరువులు, కుంటలు నిండిపోవడంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రైతులు వరి సాగుపై దృష్టి సారించారు.
అయితే వరి నాట్లకు అవసరమైన కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి మహిళలు, పురుష కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. దీంతో పలు గ్రామాల్లో వరి నాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఆలస్యంగా వరి సాగు చేపట్టడం రైతులకు అనుకూలం కాదని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే భవిష్యత్లో నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఆలస్యంగా వరి సాగు చేయడం వల్ల పంట దిగుబడిపై ప్రభావం పడటంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
రైతులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

