NIGAMA MEDIA (P) LTD
16.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

రేవంత్ ఉచ్చులో కారు పడిందా?….

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

ప్రతిపక్షాన్ని తన రాజకీయ వ్యూహంలోకి లాగుతున్నారా సీఎం? అసెంబ్లీ పరిణామాలతో కొత్త చర్చ!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేసిన రాజకీయ ఉచ్చులో కారు.. అంటే బీఆర్‌ఎస్ పడిపోయిందా?….మొదట్లో రేవంత్‌రెడ్డి సభల్లో పదేపదే కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం చూస్తే.. ఆయన తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారేమో అనిపించింది.

కానీ.. రాజకీయాలను కాస్త లోతుగా గమనిస్తే సీన్ మరోలా కనిపిస్తోంది….ప్రతిపక్షాన్ని ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండా చుట్టూ తిప్పే వ్యూహంలో రేవంత్‌రెడ్డి ముందున్నారా?

ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది….కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది…..హామీల అమలు, సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఉద్యోగుల సమస్యలు.. ఇలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఎన్నో ఉన్నాయి.

ఈ సమస్యలన్నింటినీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌పై ఉంది….కానీ.. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి

ప్రజా సమస్యల కంటే.. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను తిడుతున్నారు అనే అంశమే బీఆర్‌ఎస్ రాజకీయానికి ప్రధాన కేంద్రంగా మారిందా?…అదే నిజమైతే.. దీనివల్ల నష్టం ఎవరికి?….ప్రభుత్వానికా?….ప్రతిపక్షానికా?………….డైవర్షన్ పాలిటిక్స్?

ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు తరచూ ప్రస్తావించే ‘డైవర్షన్ పాలిటిక్స్’ మాటనే ఇప్పుడు కొందరు రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్షం.. ప్రభుత్వ సమస్యలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పోరాటం చేస్తే.. సహజంగానే అసలు సమస్యలపై చర్చ తగ్గిపోతుంది.

కేసీఆర్‌ను సీఎం తిడుతున్నారంటూ ప్రజల్లో సానుభూతి సంపాదించవచ్చు…..కానీ.. అదే సమయంలో ప్రజలు మరో ప్రశ్న అడగొచ్చు…..“మా సమస్యల కోసం మీరు ఏం చేశారు?”….ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రతిపక్షమే.

అసెంబ్లీ దగ్గరే అసలు ట్విస్ట్!….ఇక తాజా అసెంబ్లీ పరిణామాలు చూస్తే.. బీఆర్‌ఎస్ వ్యూహం కొంతవరకు బెడిసికొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి…..సమావేశాలకు ముందు రోజు కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు…..వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలి.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి.. అనే వ్యూహం స్పష్టంగా కనిపించింది.

మొదట్లో అంతా అనుకున్నట్లే సాగింది…..కానీ… తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలను మార్చేశాయి…..సబితా ఇంద్రారెడ్డి, సునీత వంటి నేతల వ్యాఖ్యలు.. ‘దుశ్శాసన పర్వం’ వంటి తీవ్ర విమర్శలు.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎదురుదాడి…..ఇవన్నీ కలిపి అసలు చర్చను మరో దిశకు మళ్లించాయి.

మంత్రి సీతక్క భావోద్వేగానికి గురికావడం.. స్పీకర్ స్పందించడం.. సభలో వాతావరణం వేడెక్కడం……చివరికి ప్రజల చర్చ ఏంటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం ఏం చేసింది? అనే ప్రశ్న కంటే.. అసెంబ్లీలో ఎవరు ఎవరిని ఏమన్నారు? అనే చర్చే ఎక్కువైంది….ఇదే రేవంత్‌రెడ్డి వ్యూహమైతే.. ఈ ఎపిసోడ్‌లో ఆయన పైచేయి సాధించినట్టే కదా!

రేవంత్ ఎందుకు పెద్దగా మాట్లాడలేదు?….ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది…..ఈ రెండు రోజుల అసెంబ్లీ పరిణామాల్లో రేవంత్‌రెడ్డి స్వయంగా పెద్దగా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు తక్కువ…..కానీ.. ఆయన పార్టీ నేతలు మాత్రం ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఒకరు మాట్లాడారు.. మరొకరు స్పందించారు.. ఇంకొకరు ఎదురుదాడి చేశారు…..దీంతో కాంగ్రెస్ పార్టీ అంతా ఒక్కటే అనే సందేశం కూడా వెళ్లింది.

అంటే.. సీఎం స్వయంగా రంగంలోకి దిగకుండానే రాజకీయ యుద్ధాన్ని నడిపించారా?….అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది…..ప్రతిసారి ప్రతిపక్షానికే ఎదురుదెబ్బ?

రేవంత్‌రెడ్డిని తక్కువ అంచనా వేసిన ప్రతిసారి ప్రతిపక్షం రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతోందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఆయన వ్యక్తిగత గ్రాఫ్ పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర అభివృద్ధిలో రేవంత్‌రెడ్డి మార్క్ ఎంతవరకు కనిపిస్తుందన్నది వేరే విషయం…..కానీ.. రాజకీయంగా తన స్థానాన్ని బలపరుచుకోవడంలో మాత్రం ఆయన ముందుకు వెళ్తున్నారనే అభిప్రాయం ఉంది.

కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు ప్రయత్నించడం.. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద తన ప్రాధాన్యతను కొనసాగించడం.. ఇవన్నీ ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నాయి….ప్రత్యర్థుల బలహీనతలే ఆయుధాలుగా మారుతున్నాయా?…ఇటీవల కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు కూడా ఇదే చర్చకు కారణమవుతున్నాయి…..మంత్రులు, పార్టీ నేతల మధ్య వివాదాలు వచ్చినప్పటికీ.. చివరికి అధికారం మాత్రం రేవంత్‌రెడ్డి చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే అంశాలు తెరపైకి రావడం.. ఆ తర్వాత ప్రతిపక్షం స్పందించడం.. ఆ స్పందనను అధికార పార్టీ తిరిగి రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడం…..ఈ ఫార్ములా పదేపదే కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

చివరికి కారు ఎటు వెళ్తుంది?….ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే…..బీఆర్‌ఎస్‌కు ప్రభుత్వంపై విమర్శించడానికి అంశాలు లేవా?….అంశాలు ఉన్నాయి…..ప్రజా సమస్యలు లేవా?….చాలానే ఉన్నాయి….మరి ఆ సమస్యలు ఎందుకు ప్రధాన రాజకీయ చర్చగా మారడం లేదు?

అక్కడే బీఆర్‌ఎస్ తన వ్యూహాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి……ఎందుకంటే…………..ప్రతిపక్షం ఏ అంశంపై పోరాడాలో ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఆ పోరాటంలో విజయం సాధించడం కష్టం.

ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై కాకుండా.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజకీయ పోరాటం చేస్తేనే ప్రతిపక్షానికి ప్రయోజనం ఉంటుంది……లేకపోతే……రేవంత్‌రెడ్డి వేసిన ఉచ్చులో కారు చిక్కుకుందనే రాజకీయ విమర్శలు మరింత బలపడే అవకాశం ఉంది.

మరి ఈ ఉచ్చు నుంచి బీఆర్‌ఎస్ బయటపడుతుందా?……లేక…..రేవంత్ వ్యూహానికే మళ్లీ మళ్లీ బలవుతుందా?…..తెలంగాణ రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఇదే ఆసక్తికరమైన ప్రశ్నగా మారనుంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.