కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 54వ డివిజన్ పరిధిలోని స్టేషన్ రోడ్ నుంచి గాంధీనగర్ వరకు నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కర్–మార్క్స్) మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు గట్టు మహేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరాలు గడుస్తున్నా పాలకులు మారుతున్నారే తప్ప కాలనీల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు మాత్రం మెరుగుపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలమయమైన రోడ్ల కారణంగా వాహనదారులు, కాలినడకన వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
డ్రైనేజీ కాలువల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారిందని, మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి ప్రజల ఇబ్బందులు రెట్టింపవుతున్నాయని అన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ఎమ్మెల్యే వెంటనే స్పందించి స్టేషన్ రోడ్ నుంచి గాంధీనగర్ వరకు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని గట్టు మహేందర్ డిమాండ్ చేశారు.
సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తే కాలనీ ప్రజలను సమీకరించి సంబంధిత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, అధికారుల కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

