హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి చేతిలో బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్ సాధనంగా మారింది
భూ వ్యవహారాల్లో భారీ అవినీతి జరుగుతోందని విమర్శ •
సామాన్యుల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటున్నారని మండిపాటు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
హైడ్రా పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను వేధిస్తూ, బ్లాక్మెయిలింగ్ మరియు ఎక్స్టార్షన్కు పాల్పడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హైకోర్టు సూచనలకు అనుగుణంగా హైడ్రాను పూర్తిగా రద్దు చేసి “బంగాళాఖాతంలో కలిపేస్తామని” స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, హైడ్రా చర్యలు ఎంపిక చేసిన వారిపైనే అమలవుతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి వివేక్ నివాసాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో హైడ్రా పేరిట అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు.
భూ వ్యవహారాలపై స్పందిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని వీడే సమయానికి నిషేధిత భూములు 16 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవి కోటి ఎకరాలకు చేరాయని పేర్కొన్నారు. భూ వ్యవహారాల్లో అవినీతి, కమీషన్ల కోసమే నిషేధిత భూముల జాబితాను విస్తరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో వేలాది ఇళ్లను కూల్చివేసినా, ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని కేటీఆర్ విమర్శించారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తూ, పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తనను “హిట్లర్” అని విమర్శిస్తున్నారని పేర్కొన్న కేటీఆర్, అదే సమయంలో తిరుపతి రెడ్డి ఇంటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ, హైడ్రా “వేట కుక్కలా” వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. చట్టం అందరికీ సమానంగా అమలైతేనే నిజమైన న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు

