Home » Singareni : సింగరేణిలో అధికారుల వేధింపులు

Singareni : సింగరేణిలో అధికారుల వేధింపులు

ఆర్హికంగా నష్టపోతున్న రిటైర్డ్ కార్మికులు
లేని నిబంధనలను సృష్టిస్తున్న అధికారులు
ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

Singareni : సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గుగనుల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు, ఉన్నతాధికారులు కార్మికులను అకారణంగా వేధిస్తున్నారని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడంతో సింగరేణి సంస్థ పేరు, ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు చెమటోడ్చి సంస్థను అభివృద్ధి చేస్తుంటే, అధికారులు తమ ఇష్టానుసారం వ్యహరించడం సరికాదన్నారు. కొందరు అధికారులు సంస్థలో లేని కొత్త నిభందనలను సొంతంగా కార్మికులపై అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పదవీ విరమణ పొందిన కార్మికులను సైతం లేని నిబంధనలను సృష్టిస్తూ వేధిస్తున్నారని, తద్వారా వారు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. పదవీ విరమణ పొందిన కార్మికుల నుంచి కేవలం గ్రాట్యుటీ మాత్రమే నిలిపివేసి, మిగతా హక్కులన్నీ అమలు చేసే విధానం ఉన్నది. కార్మికుడు తన పేరిట ఉన్న క్వాటర్ ఖాళీ చేయకుండానే అతనికి సంబందించిన బెనిఫిట్స్ ను అందజేసే విధానం ఉన్నది. కానీ కొందరు అధికారులు ఈ విధానాన్ని తొక్కిపెట్టి కార్మికులకు బెనిఫిట్స్ ను ఇవ్వడం లేదని ఆరోపించారు. దీపావళి బోనస్, లాభాల వాటాను కూడా పదవి విరమణ పొందిన కార్మికులకు ఇవ్వకుండ క్వార్టర్ పేరిట వేధిస్తున్నారని సీతారామయ్య ఆరోపించారు.

సింగరేణి సంస్థ పన్నుల పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఇస్తున్నది. ఆ నిధులు సింగరేణి ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేటాయించకుండా కార్మికేతర ప్రాంతాల్లో కేటాయిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అదే విదంగా సింగరేణి సంస్థకు ప్రభుత్వం నుంచి నలభయ్ వేల కోట్ల రూపాయలు రావలసి ఉంది. ఆ నిధులు ఎందుకు తీసుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు. కార్మికులతో సంస్థకు నష్టం లేదు. కానీ నష్టం కలిగిస్తున్న విషయాల గురించి మాత్రం అధికారులు పట్టించుకోరని సీతారామయ్య ఆరోపించారు.

నిధులు లేవనే కారణం చూపుతూ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేవలం జీఎం కార్యాలయాలకు పరిమితం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏడాదికి ఒక్కసారి కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పండుగను నిధుల పేరిట కార్మిక వర్గాలకు దూరం పెట్టడంపై సీతారామయ్య అసహనం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఏఐటీయూసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, సంస్థ భవిష్యత్తును నిర్వీర్యం చేయడానికి కొందరు పూనుకున్నారని భవిష్యత్తులో అటువంటి అధికారులు తగిన మూల్యం చెల్లించుక తప్పదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఈ సందర్బంగా హెచ్చరించారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *