CPI : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డులో కబ్జాకు గురైన సింగరేణి భూమిని అర్హులైన పేదలకు పంచుతామని సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మూత పడిన సింగరేణి సౌత్ క్రాస్ మైన్ వద్ద పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ గని పరిసర ప్రాంతం ప్రమాదకరమని సింగరేణి అధికారులు బోర్డు పెట్టినప్పటికీ కొందరు ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో సీపీఐ పోరాటం చేసి కబ్జాకు గురైన భూములను కాపాడటం జరిగిందన్నారు. ఒక కుల సంఘానికి చెందిన కొందరు నాయకులు రాత్రికి రాత్రే హద్దులు పెట్టి ఆక్రమించుకుంటున్నారని అయన ఆరోపించారు.
సింగరేణి అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన భూమిని తిరిగి వెంటనే స్వాధీనం చేసుకోవాలని అయన డిమాండ్ చేశారు. లేనిచో తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే శాంతియుత ఆందోళనకు సింగరేణి యాజమాన్యమే భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు. అప్పటికి యాజమాన్యం తగిన చర్యలు తీసుకొని నేపథ్యంలో తమ పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఆక్రమణకు గురైన భూమిని ఇండ్ల స్థలాలుగా చేసి పంపిణీ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం, 31 వార్డు సిపిఐ శాఖ కార్యదర్శి గుండా ప్రశాంత్, నాయకులు మహేందర్ రెడ్డి, పట్టణ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, 31 వార్డు ప్రజలు పాల్గొన్నారు

by