Politics : సమాజంలో నిజం, అబద్దం రెండూ సమంగానే ఉంటాయి. రాజకీయ నాయకులు ఈ రెండింటిని ఆయుధంగా వాడుకొని ప్రజల్లోకి వెళుతారు. అంతే కాదు ఒక పార్టీ నాయకులు మరొక పార్టీ పై కూడా అబద్దం, నిజం మాటలతో దుమ్మెత్తి పోసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఉద్యమం సమయంలో నిజం మాట్లాడినా, అబద్దం మాట్లాడినా జనం నమ్మారు. ఆయన వెంట నడిచారు. కానీ ఇప్పుడు పదేళ్ల పరిపాలన అనంతరం ఆయన వెంట లేరు. ఇందుకు తార్కాణం అసెంబ్లీ, పార్లమెంట్, అసెంబ్లీ ఉపఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు.
ఉద్యమం సమయంలో నిధులు, నీళ్లు, నియామకాలు అన్నారు కేసీఆర్. నీటి కేటాయింపులు, వాటి హక్కులు అనే అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకొని ఇప్పుడు పార్టీని కాపాడుకోడానికి మరో ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రధాన నేతలతో కీలక సమావేశాన్ని ఆదివారం నిర్వహించడానికి కేసీఆర్ ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలోనే కార్యాచరణను సిద్ధం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదయినది. గతంలోని పరిస్థితులకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు పోల్చుకుంటే పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. కేసీఆర్ నీటి సమస్య అంటూ ప్రజల్లోకి వెళితే ఎంత వరకు నమ్ముతారనేది అనుమానమే అంటున్నారు రాజకీయ శ్రేణులు.
వరుస దెబ్బలతో బిఆర్ఎస్ కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు నీళ్లు ఆయుధంగా పార్టీ అధినేత కు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఎపి తో పాటు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోతున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను తనవైపు తిప్పుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ పరంగా చేపట్టిన నీటి పోరాటం గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపవచ్చనేది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్టు సమాచారం.
ఉద్యమం కాలంలో అధినేత కేసీఆర్ మాటలు తూటాలైనవి. ఆయన ఏది మాట్లాడినా రాజకీయంగా పెద్ద చర్చ అయ్యేది. రాజకీయ పరిస్థితిలు నాటికి, నేటికీ మారిపోయాయి. తాజాగా ఆయన ఒకవేళ మాట్లాడితే అంతా అతిశయోక్తిలా ఉంటుంది. పార్టీ సిల్వర్ జుబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడిన మాటలు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంతకూ సభ జరిగిందా అనే విధంగా ఆయన మాట్లాడిన తీరులో కనిపించింది. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే కేసీఆర్ కష్టపడాల్సిందే. కేటీఆర్, హరీష్ రావు తో సాధ్యం కాదనేది తేలి పోయింది. కేసీఆర్ ఆదివారం నిర్వహించే సమావేశం ఒక ప్రయత్నం అవుతుంది. కానీ అది భవిష్యత్తులో ఓట్ల కు ఏమేరకు పనిచేస్తుందనేది అనుమానమే అంటున్నారు రాజకీయ శ్రేణులు.
కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాస్తే అసెంబ్లీ నిర్వహిస్తాను. మూడు, నాలుగు రోజులైనా అసెంబ్లీ పెడతాను. అసెంబ్లీలోనే నీటి వాటాలపై చర్చ పెడుతాం. ఎవరి హయాంలో గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి ఎవరు ఏమి చెసిండ్రో చర్చ చేద్దామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే అసెంబ్లీ కి రమ్మని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డి. కానీ అసెంబ్లీ కి రాకుండా ప్రజల్లోకి మాత్రమే జల వివాదాలను తీసుకెళ్లి ప్రజలను నమ్మించడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఏమేరకు ఫలించనుందో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ శ్రేణులు .
————————————

పొలిటికల్ బ్యూరో
సిహెచ్ పరశురాం
9603505050
———————————–

by