srisailam : శ్రీశైలం మల్లి కార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు ముందుగానే శ్రీశైలం క్షేత్రానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శివ స్వాములు కూడా పాదయాత్రలో తరలి రావడం విశేషం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా శివ,పార్వతుల భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పండుగకు ముందుగానే రావడం విశేషం. మార్చి ఒకటో తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆలయం అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల పల్లకి సేవలో తండోపతండాలుగా భక్తులు పాల్గొన్నారు. ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు కనులార చూడటానికి తరలి రావడం విశేషం. వివిధ రకాల పూలను సేకరించారు. 250 కిలోల పూలతో స్వామి వారి పల్లకిని అలంకరించారు. పల్లకి సేవలో కూడా భక్తులు పాల్గొని స్వామి వారిని కనులార చూసి పరవశించిపోయారు. కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. నది వద్ద ముందు జాగ్రత్తగా అధికారులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.
శ్రీశైలం అధికారులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోడానికి క్యూ లో వచ్చే భక్తులకు పాలు, బ్రేడ్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అదేవిదంగా తాగునీరు, వైద్యం, వృద్ధులను చేరవేయడానికి వాహనాలను సైతం ఏర్పాటు చేయడం విశేషం.