Singareni : సింగరేణి బొగ్గు గని కార్మికులకు హామీ ఇవ్వడం అంటే అత్తగారింటికి అల్లుడు వెళ్ళి వచ్చినట్టు అనుకుంటారు ఎన్నికల్లో పోటీచేసే నాయకులు. అత్తగారింటిలో ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అత్తమామలు కూడా అల్లుడే కదా అని మర్యాదతో ఓపిక పడుతారు. ఇలా సింగరేణి కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని సాధ్యం కానీ హామీలు ఇవ్వడం నాయకులుకు సాధారణ మైపోయింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సోమవారం మంచిర్యాల సభలో మాట్లాడిన మాటలు విన్న సింగరేణి కార్మికుల్లో కాస్తో, కూస్తో పరిజ్ఞానం ఉన్న కార్మికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతే కాదు ఆ సభలో ఉన్న INTUC నాయకులు కూడా ఆ మాటలు విని చెవులు కొరుక్కోవడం కనిపించింది.
తాను గెలిస్తే, గెలిస్తే ఏమిటి… గెలుస్తా అనే ధీమాలో నరేందర్ రెడ్డ్ మాట్లాడుతూ సింగరేణిలో బి.టెక్, ఎంటెక్ చదివిన వారికి సూటబుల్ ఉద్యోగం ఇప్పిస్తాను, కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు కోసం శ్రమిస్తాను అంటూ ప్రసంగించారు. ఈ రెండు సమస్యలను ఎలా పరిష్కరిస్తారో వివరించాలంటున్నారు సింగరేణి కార్మికులు.
బిటెక్, ఎంటెక్ చదివి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నవారు ఉన్నది వాస్తవమే. వారందరు కూడా వాళ్ళ తండ్రులు పదవీ విరమణ పొంది, వాళ్ళ స్థానంలో కొడుకులు ఉద్యోగం చేస్తున్నవారే. తండ్రి ఉద్యోగం కొడుకుకు ఇవ్వడం వరకే నిబంధనలు ఉన్నవి. కానీ చదివిన చదువుకు సరిపడే ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన సింగరేణిలో లేదు. సంస్థలో అంతర్గత ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వస్తేనే, దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. ఆ విదంగా ఎంపిక అయిన వారికి మాత్రమే సూటబుల్ ఉద్యోగం వస్తుంది.
ఇక పోతే ఆదాయపు పన్ను రద్దు కోసం శ్రమిస్తాను అంటూ సెలవిచ్చారు నరేందర్ రెడ్డి. సింగరేణి కార్మికులకు ఎంపీలు వెంకటస్వామి, సుగుణ కుమారి, వివేక్ వెంకటస్వామి, బాల్క సుమన్ లు సైతం ఆదాయపు రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ హోదాలో ఉన్న వాళ్ళతోనే సాధ్యం కాలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి శ్రమిస్తాను అంటే ఇప్పుడు కార్మికులు నమ్మే పరిస్థితి లేదు.
ఇప్పుడు ఉన్న నాయకులతో పాటు సింగరేణి గనులపై ప్రచారానికి రాబోయే నాయకులుకు మాజీ ఎంపీ వెంకటస్వామి గురించి ఒక మాట చెప్పక తప్పదు. ఎంపీ గా పోటీచేస్తున్న సమయంలో వెంకటస్వామి కూడా ఆదాయపు పన్ను రద్దు చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. సమస్య పరిస్కారం కాలేదు. దాంతో ఆయన ఆ తరువాత ఎన్నికల్లో కార్మికులవైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆదాయపు పన్ను రద్దు చేస్తాం, శ్రమిస్తాం, కొట్లాడుతాం, పోరాటాలు చేస్తాం, పార్లమెంట్ లో గొంతెత్తి మాట్లాడుతాం అంటూ ఉత్తర ప్రగల్బాలు పలికే ముందు కార్మికుల పరిజ్ఞానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు, కార్మికులు అభిప్రాయపడుతున్నారు.