TDP : తెలంగాణాలో నిర్వహించిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో తెలుగు దేశంపార్టీ సృష్టించిన ప్రకంపనలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు తమ సత్తా చాటి పసుపు పతాకాన్ని ఎగురవేశారు. కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు కూడా తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా నాయకులపై ప్రభావం చూపే ఎన్నికలు. ఎంతయినా మెడలో కండువా వేసుకోవాల్సిందే. పార్టీ గుర్తుతో సంబంధం లేకుండానే తెలుగు దేశం పార్టీ మద్దతుతో విజయం సాధించడం విశేషం.
మొదటి విడత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో తొమ్మిది గ్రామ పంచాయితీ స్థానాలను తెలుగు దేశం నాయకులు దక్కించుకున్నారు. రెండు, మూడో విడత జరిగిన ఎన్నికల్లో ఇరువై స్థానాల్లో తమ సత్తా చాటి టీడీపీ జెండా ఎగురవేశారు. ఈ ఇరువైలో ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలిచినట్టు సమాచారం. తెలుగు దేశం పార్టీ తరుపున బలపరచిన అభ్యర్థులు మంచి మెజార్టీ సాధించినట్టు ప్రచారం సాగుతోంది.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వెలనాటి సునీత ఏకంగా 1258 ఓట్లతో విజయం సాధించి సర్పంచ్ కావడం విశేషం. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గట్టు బూత్కూరు గ్రామ పంచాయితీని మల్కాపురం రాజేశ్వరి 900 ఓట్ల మెజార్టీ సాధించి సర్పంచ్ గా ఎంపికయినారు. ఖమ్మం, నల్లొండ జిల్లాలో కూడా ఇద్దరు అభ్యర్థులు 500 ఓట్లకు పైగా మెజార్టీ సాధించి సర్పంచి గా ఎన్నిక కావడం విశేషం.
రాష్ట్రంలోని 12,728 పంచాయితీ స్థానాల్లో తెలుగు దేశం మద్దతుదారులు సాధించిన స్థానాలను పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు దేశం పార్టీకి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆ పార్టీ మద్దతు దారులు సాధించింది గొప్పగానే చెప్పుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
——————————-

పొలిటికల్ బ్యూరో
సిహెచ్ పరశు రాం
9603982983
——————————-

by