Congress : సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. ఒకరు సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు, మరొకరు మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్. వీరిద్దరికి సిద్ధిపేట జిల్లా కంచుకోట. అంతే కాదు రాజకీయంగా పుట్టినిల్లు కూడా. అందుకే రాబోయే ఎన్నికల్లో వీరిద్దరిని పుట్టింటికే పరిమితం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టుగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే కేసీఆర్ బలం, బలహీనతలు బాగా తెలిసిన మైనంపల్లి హనుమంత రావు కు సిద్ధిపేట జిల్లాలో సీఎం మకాం పెట్టిచ్చినట్టుగా గుసగుసలు మొదలైనాయి.
మైనంపల్లి, కేసీఆర్ ఇద్దరు కలిసి తెలుగుదేశంలో పనిచేశారు. కేసీఆర్ రాజకీయ నైపుణ్యం తెలిసిన వ్యక్తి మైనంపల్లి. అందుకనే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మైనంపల్లి ని రాజకీయ చదరంగంలోకి దించినట్టుగా సమాచారం. ముందుగా గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తో పాటు కేసీఆర్ కు ఉన్న పట్టు ను పరిశీలించాలని సీఎం మైనంపల్లికి ఆదేశాలు ఇచ్చినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గజ్వేల్ నివేదిక అనంతరం సిద్ధిపేట పై మైనంపల్లి దృష్టి పెడతారని పార్టీలో పెద్ద టాక్ కొనసాగుతోంది.
గత ఎన్నికల్లో మైనంపల్లి మల్కాజిగిరి నుంచి ఓటమిపాలైనారు. తన సొంత నియోజకవర్గాన్ని కొడుకు చేతిలో పెట్టారు. అందుకనే సిద్దపేట జిల్లాలో ఎదో ఒక నియోజకవర్గాన్ని మైనంపల్లి హన్మంతరావు ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అందులో భాగంగానే మైనంపల్లి హనుమంత రావు సీఎం ఆదేశాలతో తన రాజకీయ మకాంను సిద్ధిపేట జిల్లాకు మార్చినట్టుగా రాజకీయ గుసగుసలు వినిపిస్తున్నాయి.

by