BJP : భారత దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీ భారతీయ. కానీ పార్టీ నడవాల్సింది అంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కనుసన్నల్లోనే ఉంటుంది. బీజేపీ తో పాటు దాని అనుబంధ సంఘాలన్నీ కూడా సంఘ్ మాటకు కట్టుబడి ఉండాల్సిందే. కొత్తగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను నియమించడానికి తాజాగా కొత్త నిబంధనలను సంఘ్ ముందుకు తీసుకు వచ్చింది. సంఘ్ నేపథ్యం ఉన్న వారినే రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించాలనే నిబంధన తీసుకు రావడంతో బీజేపీ ఢిల్లీ పెద్దలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణ లో మాత్రం కొంచెం కష్టంగానే కనబడుతోంది.
ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగిన వారిలో కిషన్ రెడ్డి వరకు కూడా సంఘ్ పరివార్ లో ఓనమాలు దిద్దినవారే కావడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర భాద్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం కోసం ఢిల్లీ పెద్దలు కుస్తీ పడుతూనే ఉన్నారు. అధ్యక్ష పదవి కోసం ఎంపీలు రఘనందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ్ పోటీపడుతున్నారు.
బెంగళూరులో ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రతినిధి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లోనే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నేపథ్యం ఉన్న వారికే అధ్యక్ష పదవులు అప్పగించాలని సంఘ్ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే జరిగిన మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నికల్లో అధిక శాతం ‘సంఘ్’ నేపథ్యం ఉన్నవారికే భాద్యతలు అప్పగించారు. ఇప్పుడు రాష్ట్రాల అధ్యక్షుల నియామకం కూడా ‘సంఘ్’ ఆదేశాల మేరకే నియమించే అవకాశాలు ఎక్కువగా నకబడుతున్నాయి.
రాష్ట్ర అధ్యక్ష భాద్యతలను ఈటల రాజేందర్ కు అప్పగించాలనే ఆలోచన కూడా కేంద్ర నాయకత్వానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను కొందరు బీజేపీ పెద్దలు వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీకే అరుణ ఒకే జిల్లా నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆమెకే భాద్యతలు ఇచ్చిన నేపథ్యంలో సీఎం ను రాజకీయంగా ఎదుర్కోడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బీజేపీ లో ఒక వాదన వినిపించడం కొసమెరుపు.