Medigadda : బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో ఆశలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించారు. తన పేరు చిరకాలం ఉండాలనే కోరికతో కట్టించిన ప్రాజెక్టు సరిగ్గా ఎన్నికలకు ముందు రాజకీయ కష్టాల్లోకి నెట్టింది. రెండు శాతం ఓట్ల తేడాతో అధికారం పోడానికి గల కారణాల్లో కాళేశ్వరం కూడా ఒక కారణమని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం ఏర్పడింది. మేడిగడ్డ కుంగిపోయి ఇప్పుడు బిఆర్ఎస్ అధినేతకు గుదిబండ అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయనే అభిప్రాయాలు సైతం రాష్ట్రంలో వ్యక్తమవుతున్నాయి.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి. అధికారం చేపట్టిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 115 మందిని కమిషన్ గత 15 నెలల కాలంలో విచారించింది. అందులో కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ లను సైతం విచారించింది.
పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసిన నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేయనుందని సమాచారం. కమిషన్ ముందు కేసీఆర్ విచారణ పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సైతం సిద్ధమవ్వడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సీఎం మాట్లాడిన తర్వాత తాను కూడా ప్రాజెక్ట్ గురించి మాట్లాడతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పాటికే ప్రకటించారు. ప్రాజెక్ట్ డిజైన్, అనుమతులపై కమిషన్కు కేసీఆర్ పూర్తి సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రజెంటేషన్తో ఎలాంటి కొత్త విషయాలు బయటకోస్తాయో అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైనది. ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయినప్పటికీ రాజకీయ ప్రకంపనలు మాత్రం తగ్గే అవకాశాలు కనబడటంలేదు. కమిషన్ ఫలితం తేలే వరకు కాళేశ్వరం నిందను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుదిబండగా మోయక తప్పదంటున్నారు రాజకీయ శ్రేణులు.